పుట్రేలలో రీ-సర్వే పనులను పరిశీలించిన ఆర్డీవో ఏ. కుమార్
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట: భూముల రీ-సర్వే పనులను అధికారులు పారదర్శకంగా, ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. కుమార్ సూచించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం పుట్రేల గ్రామంలో బుధవారం జరుగుతున్న రీ-సర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా సర్వే ప్రక్రియ, భూముల సరిహద్దుల గుర్తింపు, రికార్డుల పరిశీలన తదితర అంశాలపై సంబంధిత అధికారులతో ఆర్డీవో సమీక్షించారు. రీ-సర్వే పనులు ఏ మేరకు పూర్తయ్యాయి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు ఏమిటనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం రైతులతో మాట్లాడిన ఆర్డీవో ఏ. కుమార్, రీ-సర్వే ద్వారా భూముల సరిహద్దులను స్పష్టంగా నమోదు చేయడంతో పాటు భూ రికార్డుల్లో ఉన్న వివరాలను సరిచేసుకునేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. రీ-సర్వే ప్రక్రియపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. సర్వే కార్యక్రమానికి రైతులు సహకరించాలని కోరారు.
భూములకు సంబంధించి ఏవైనా సందేహాలు, సమస్యలు ఉంటే సంబంధిత రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచించారు. సమస్యలను నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రీ-సర్వే పనులను నిబంధనల ప్రకారం పారదర్శకంగా, ఖచ్చితత్వంతో, వేగవంతంగా పూర్తి చేయాలని ఏ. కుమార్ అధికారులకు స్పష్టం చేశారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.