పెనుగొలనులో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని బస్టాండ్ సెంటర్, మాలపల్లి, బోటు మీద, గౌడ సంఘం కమ్యూనిటీ భవనం వద్ద వైఎస్సార్ విగ్రహాలకు, చిత్రపటాలకు పలువురు నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వక్తలు మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అట్టడుగు వర్గాల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 104, 108 వంటి ప్రజోపయోగ కార్యక్రమాలను అమలు చేసి పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. ప్రజల కోసం ఆయన చేసిన సేవలను ఎన్నటికీ మరువలేమన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు వెదురు వెంకటరెడ్డి, ఇనపనూరి శంకర్రావు, వడ్డెబోయిన శ్రీను, పంది అంజయ్యతో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.