రాయచోటి హాస్టల్ భవనాల కోసం విద్యార్థుల ఫిర్యాదు..
రాయచోటి హాస్టల్ భవనాల కోసం విద్యార్థుల ఫిర్యాదు.. పీజీఆర్ఎస్లో ఆర్డీవోకు వినతి
అన్నమయ్య జిల్లా రాయచోటి: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు హాస్టల్ భవనాలను తిరిగి తమకు అప్పగించాలని కోరుతూ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆర్డీవో శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు.
అఖిల భారత స్టూడెంట్స్ పవర్ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ నేతృత్వంలో విద్యార్థులు పీజీఆర్ఎస్కు హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం సుమారు 250 మంది విద్యార్థులకు హాస్టల్ వసతి లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
హాస్టల్ సౌకర్యం లేక ప్రైవేట్ వసతి గృహాల్లో ఉండాల్సి వస్తోందని, ఇందుకు అధిక మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించిన హాస్టల్ భవనాలను వెంటనే విద్యార్థుల వినియోగానికి అప్పగించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
తమ సమస్యపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని అఖిల భారత స్టూడెంట్స్ పవర్ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని హాస్టల్ సౌకర్యాన్ని వెంటనే పునరుద్ధరించాలని కోరారు.