రైతులకు శుభవార్త మే 26న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
దేశవ్యాప్తంగా తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) ఊరటనిచ్చే వార్త చెప్పింది. దేశ వ్యవసాయానికి ప్రాణాధారమైన నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది మే 26న కేరళ తీరాన్ని తాకే అవకాశముందని ఐఎండీ ప్రకటించింది. సాధారణంగా జూన్ 1న కేరళలోకి ప్రవేశించే రుతుపవనాలు ఈసారి ఐదు రోజుల ముందుగానే రానుండటం విశేషం.
వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో రుతుపవనాల ముందస్తు రాకకు అవకాశాలు మెరుగయ్యాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే అండమాన్ సముద్ర ప్రాంతంలో వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయని, మరో 48 గంటల్లో అక్కడికి నైరుతి రుతుపవనాలు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు.
భారత వ్యవసాయ రంగానికి నైరుతి రుతుపవనాలు అత్యంత కీలకం. దేశంలో 50 శాతానికి పైగా సాగుభూమి ఇప్పటికీ వర్షాధారంగానే సాగు అవుతోంది. మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో సుమారు 40 శాతం దిగుబడి ఈ వర్షాలపైనే ఆధారపడి ఉంటుంది. అందువల్ల రుతుపవనాల సమయానుకూల రాక రైతులకు ఆశాజనకంగా మారింది.
ముఖ్యంగా ఖరీఫ్ పంటల సాగుకు ఇది ఊతమివ్వనుంది. వర్షాలు సకాలంలో కురిస్తే వరి, పత్తి, మొక్కజొన్న, పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.