రెడ్డిగూడెం: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి
కూటమి ప్రభుత్వ హయాంలో డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి, రెడ్డిగూడెం వైస్ ఎంపీపీ చాట్ల రాబర్ట్ డిమాండ్ చేశారు.
డీఎస్సీ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీని తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తూ తన కుమారుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వాస్తవాలను ప్రశ్నిస్తున్న వారిపై తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారని, రాష్ట్రంలో "రెడ్ బుక్ రాజ్యాంగం" కొనసాగుతోందని విమర్శించారు.
డీఎస్సీ పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు పొందిన వారిని క్రీడాకారిణి పీవీ సింధూతో పోల్చడం హాస్యాస్పదంగా ఉందన్నారు. డీఎస్సీకి హాజరు కాకుండా, క్రీడా విభాగంలో ఎలాంటి శిక్షణ లేకుండానే 372 మందికి ఉద్యోగాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రభుత్వం చెబుతున్నట్లయితే ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించేందుకు ఎందుకు వెనుకాడుతోందని రాబర్ట్ ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.