రహదారి ఆక్రమణలపై మంత్రి ఎన్ఎండి ఫరూక్ సీరియస్
రహదారి ఆక్రమణలపై మంత్రి ఎన్ఎండి ఫరూక్ సీరియస్ .... తక్షణమే తొలగించాలని కమిషనర్కు ఆదేశం
నంద్యాల,
నంద్యాల పట్టణంలోని ప్రధాన కూడలి అయిన శ్రీనివాస్ సెంటర్ సమీపంలో ఉన్న ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ పక్కన ఉన్న సందు ఆక్రమణకు గురికావడంపై రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ తీవ్రంగా స్పందించారు. స్థానికంగా ఉన్న ఈ కీలకమైన సందును కొందరు వ్యక్తులు ఆక్రమించి, మూసివేయడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన మంత్రి ఫరూక్ శనివారం స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. సందు మూసివేత వల్ల రాకపోకలకు కలుగుతున్న అంతరాయాన్ని పరిశీలించిన ఆయన, ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న గారిని సంఘటన స్థలానికి పిలిపించి మాట్లాడి, సందును ఆక్రమణలను తక్షణమే తొలగించాలి. మూసివేసిన మార్గాన్ని వెంటనే తెరిపించి, సాధారణ ప్రజల ఉపయోగంలోకి తీసుకురావాలిని తెలిపారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, సందులు ఆక్రమణలకు గురికాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజల సౌకర్యార్థం ఉన్న దారులను ఆక్రమించడం చట్టవిరుద్ధమని, మున్సిపల్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మంత్రి ఫరూక్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.