రమణక్కపేటలో కిసాన్ మహాసభ…
రమణక్కపేటలో కిసాన్ మహాసభ… రైతుల భూములపై ఫారెస్ట్ వివాదం మళ్లీ రగులుతోంది
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో భూముల సమస్యపై రైతులు మరోసారి గళమెత్తారు. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీకి చెందిన అఖిలభారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మహాసభలో చిన్న, సన్నకారు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గ్రామంలోని సర్వే నంబర్లు 1, 2, 3, 4/33లో జాయింట్ సర్వే నిర్వహించి సుమారు 4020 ఎకరాల భూమిని ఫారెస్ట్ కాని భూమిగా గుర్తించినప్పటికీ, ప్రస్తుతం అది అడవిగా చూపిస్తూ రైతుల సాగుభూములను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఆర్ఎస్ నెంబర్ 229/3లో ఉన్న 120 ఎకరాలను రిజర్వ్ ఫారెస్ట్గా పేర్కొంటూ తమ సొంత భూములను ఆక్రమిస్తున్నారని ఆరోపించారు.
ఫారెస్ట్ అధికారులు కాంటూర్ కందకాలు తవ్వడం, సిమెంట్ కాంక్రీట్ తిమ్మలు (కేరెన్స్) ఏర్పాటు చేయడం పూర్తిగా అన్యాయమని రైతులు పేర్కొన్నారు. ఈ విషయంపై న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని సెంటిమెంట్ కోర్టులో క్లైములు దాఖలు చేసినట్లు తెలిపారు.
మార్చి 2న ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పిజిఆర్ఎస్ ద్వారా ఫిర్యాదు చేసినప్పటికీ, ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఫారెస్ట్ మరియు రెవెన్యూ అధికారులు వచ్చి పరిశీలన చేసి వెళ్లిపోయారని రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో జాయింట్ సర్వే నిర్వహిస్తామని అధికారులు హామీ ఇచ్చినా ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదని చెప్పారు.
ఇకపై కూడా సంబంధిత రైతులను సంప్రదించకుండా ఏకపక్షంగా సర్వేలు జరిపితే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని బక్కయ్య హెచ్చరించారు. నిష్పక్షపాతంగా జాయింట్ సర్వే నిర్వహించి, నిజమైన సాగుదారులను గుర్తించి పట్టాలు మంజూరు చేయాలని, జాయింట్ కలెక్టర్ ప్రజలతో ముఖాముఖి సమీక్ష నిర్వహించి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పల్లెపాము భవాని, కొక్కరిగడ్డ నాగేశ్వరరావు, ఆముదాల సురేష్, పందర్ల సాంబయ్య, పామర్తి శ్రీనివాసరావు, పామర్తి కొండలరావు, తొలిమెల్లి యాకోబు తదితరులు పాల్గొన్నారు.