అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్ల పంపిణీ
కైకలూరు, జూలై 22: కైకలూరు నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇండక్షన్ స్టవ్లను శాసనసభ్యుడు డా. కామినేని శ్రీనివాస్ కైకలూరు మార్కెట్ యార్డులో పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులు, గర్భిణీలు, బాలింతల ఆరోగ్యం కోసం అంగన్వాడీ కార్యకర్తలు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేసి, మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
గ్యాస్ సిలిండర్లపై ఆధారపడకుండా ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లు, ఆధునిక వంట పాత్రలను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. వీటి ద్వారా చిన్నారులకు నాణ్యమైన, వేగవంతమైన పౌష్టికాహారం అందించడంతో పాటు కాలుష్యం తగ్గి, అంగన్వాడీ సిబ్బందికి వంట పనులు మరింత సులభమవుతాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యుడు కమ్మిలి విఠల్ రావు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వీరమల్లు నరసింహారావు, ఎన్డీయే నాయకులు, ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.