తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేస్తోంది: బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు చేపట్టేందుకు కూడా ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపించారు.
22-ఏ బాధితుల సమస్యలపై గళమెత్తేందుకు కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని రామచందర్ రావు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరసన చేపట్టాలంటే ముందుగా న్యాయస్థానం అనుమతి తీసుకోవాల్సి రావడం రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిస్థితులు ఏ స్థాయికి చేరాయో తెలియజేస్తోందని విమర్శించారు.
ప్రజల హక్కులను, నిరసన తెలిపే స్వేచ్ఛను ప్రభుత్వం గౌరవించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాంతియుత నిరసనలు కూడా ప్రజల హక్కేనని, వాటిని అడ్డుకోవడం సరికాదని రామచందర్ రావు పేర్కొన్నారు.