గుంటూరు: మహిళను కత్తితో బెదిరించి అత్యాచారం.. వీడియోలతో బ్లాక్మెయిల్
గుంటూరులో మహిళను కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, వీడియోలతో బ్లాక్మెయిల్కు పాల్పడిన నిందితుడిని నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. తాడికొండ మండలం తాతిరెడ్డిపాలెంకు చెందిన గణేష్.. గుంటూరు కన్నావారితోటకు చెందిన మహిళను గత నెల 14న కత్తితో బెదిరించాడు. అనంతరం ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని లాం సమీప ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
అనంతరం బాధితురాలికి సంబంధించిన వీడియోలను చిత్రీకరించి, వాటిని బయటపెడతానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు వెల్లడించారు. తాను పిలిచినప్పుడల్లా రావాలని, లేదంటే వీడియోలను బహిర్గతం చేస్తానంటూ నిందితుడు ఆమెను వేధించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
నిందితుడి వేధింపులు భరించలేక బాధితురాలు నల్లపాడు పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలు, ఇతర వివరాలను సేకరించి నిందితుడిని గుర్తించిన పోలీసులు గణేష్ను అరెస్ట్ చేశారు.
మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. బాధితులు భయపడకుండా తమకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు.