పోలిశెట్టిపాడు గ్రామ సచివాలయంలో తల్లికి వందనం లబ్ధిదారుల జాబితా విడుదల
పొలిశెట్టిపాడు గ్రామ సచివాలయంలో జాబితా ఆవిష్కరణ
ఏ.కొండూరు, జూలై 22: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం కింద నిధులు విడుదలైన సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం పొలిశెట్టిపాడు గ్రామ సచివాలయంలో లబ్ధిదారుల జాబితాను ఆంధ్రప్రదేశ్ మాదిగ వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియ్య విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల విద్యాభివృద్ధికి, తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రతి అర్హ కుటుంబానికి సంక్షేమ ఫలాలు పారదర్శకంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. జాబితాలో పేరు లేని వారు నిరాశ చెందకుండా అవసరమైన పత్రాలతో గ్రామ సచివాలయంలో సంప్రదించాలని సూచించారు. అండర్ వెరిఫికేషన్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి అర్హులకు పథకం ప్రయోజనం అందించాలని అధికారులను కోరారు.
గ్రామ సచివాలయ పరిధిలో మొత్తం 529 మంది అర్హులు, 47 మంది అనర్హులు, 18 దరఖాస్తులు అండర్ వెరిఫికేషన్లో ఉన్నట్లు వెల్లడించారు.
గ్రామ సచివాలయ కార్యదర్శి రజిని మాట్లాడుతూ, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల వివరాలను పరిశీలించి జాబితాను రూపొందించినట్లు తెలిపారు. అర్హతలపై సందేహాలు ఉన్న వారు సచివాలయంలో సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గుల్జార్ బేగం, వీఆర్వో నాగుల్ మీరా, అత్తునూరు చెన్నారెడ్డి, అత్తునూరు శ్రీనివాసరెడ్డి, పొలిశెట్టిపాడు జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు శోభన్బాబు, హెచ్డబ్ల్యూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముప్పిడి రాజశేఖర్రెడ్డి, గాంధీనగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. రాజు, సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.