రూ.3,478 కోట్లతో దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణకు శంకుస్థాపన
రాయలసీమ పారిశ్రామికాభివృద్ధికి మరో కీలక అడుగు
జమ్మలమడుగు, జూలై 15: వైఎస్ఆర్ కడప జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చే మరో భారీ ప్రాజెక్టుకు బుధవారం శ్రీకారం చుట్టారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం మండలం చిన్నకొమర్ల గ్రామంలో రూ.3,478 కోట్ల పెట్టుబడితో చేపట్టనున్న దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ యూనిట్–2 నిర్మాణ పనులకు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్, దాల్మియా సిమెంట్స్ చైర్మన్ పునీత్ యధు దాల్మియాతో కలిసి భూమిపూజ నిర్వహించి, శంఖుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సి. ఆదినారాయణ రెడ్డి, యువనేత భూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దాల్మియా సంస్థ తరఫున గ్రూప్ హెడ్ అనుపమ్ అగర్వాల్, ప్లాంట్ హెడ్ అర్పన్ కుమార్ పరెక్, నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ హెడ్ గణేష్ వామన్ రావ్, మ్యానుఫ్యాక్చరింగ్ హెడ్ మనోజ్ శ్రీవాస్తవ్తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
అనంతరం నిర్వహించిన సభలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ, రాయలసీమను పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. భారీ పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, వైఎస్ఆర్ కడప జిల్లాను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు.
రూ.3,478 కోట్లతో చేపట్టనున్న ఈ విస్తరణ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి సామర్థ్యం పెరగడంతో పాటు వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు రాయలసీమ పారిశ్రామికాభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.