ముసునూరులో టీడీపీ మండల విస్తృత స్థాయి సమావేశం
ముసునూరులో టీడీపీ మండల విస్తృత స్థాయి సమావేశం
చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలి – నూజివీడు–ఏలూరు రహదారి వెంటనే నిర్మించాలి: తీర్మానాలు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరులో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు గద్దె రఘుబాబు ఆధ్వర్యంలో బుధవారం మండల పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ బలోపేతంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంపై సమావేశంలో విస్తృతంగా చర్చించి రెండు కీలక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
మొదటి తీర్మానంగా చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి రైతులకు సకాలంలో సాగునీరు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. రెండో తీర్మానంగా నూజివీడు నుంచి ఏలూరు వరకు ప్రయాణించే ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆ రహదారి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
రాబోయే మూడు నెలల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రతి గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరవేయాలని గద్దె రఘుబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ విభేదాలను పక్కనపెట్టి ఏకతాటిపైకి వచ్చి సమష్టిగా పనిచేయాలని సూచించారు.
సమావేశంలో పలువురు రైతులు వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ల కొరత వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రస్తావించగా, వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ సమావేశంలో మండలంలోని 16 గ్రామాల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, జిల్లా అనుబంధ కమిటీల ప్రతినిధులు, మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్లు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సమావేశ తీర్మానాలను స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు.