పంటలకు బీమా నమోదు ప్రారంభం..
పంటలకు బీమా నమోదు ప్రారంభం.. రైతులకు కేంద్రం భరోసా చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్
ప్రకృతి విపత్తులతో పంట నష్టపోయినా ఆందోళన అవసరం లేదు.. స్వల్ప ప్రీమియంతో భారీ రక్షణ
చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ పిలుపు
చాట్రాయి, జూలై 15: ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, కరువు, తుఫాన్లు, ఇతర అనూహ్య వాతావరణ పరిస్థితులతో పంటలు దెబ్బతిని నష్టపోతున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి భరోసా కల్పిస్తోంది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) కింద ఖరీఫ్ సీజన్కు పంటల బీమా నమోదు ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైనట్లు చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ తెలిపారు. స్వల్ప మొత్తంలో ప్రీమియం చెల్లించి వేలాది రూపాయల బీమా రక్షణ పొందే ఈ అవకాశాన్ని ప్రతి రైతు తప్పకుండా వినియోగించుకోవాలని ఆయన కోరారు. పంట నష్టం సంభవించినప్పుడు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం అందడంతో రైతులకు ఆర్థిక భరోసా లభిస్తుందని పేర్కొన్నారు. కంది, శనగ పంటలకు ఎకరాకు రూ.80 ప్రీమియంతో రూ.20 వేల వరకు, ఎర్ర మిరపకు రూ.576 ప్రీమియంతో రూ.90 వేల వరకు, జొన్నలకు రూ.84 ప్రీమియంతో రూ.21 వేల వరకు, మొక్కజొన్నకు రూ.132 ప్రీమియంతో రూ.33 వేల వరకు, వరికి రూ.164 ప్రీమియంతో రూ.41 వేల వరకు, ఆముదానికి రూ.80 ప్రీమియంతో రూ.20 వేల వరకు బీమా రక్షణ లభిస్తుందని తెలిపారు. వాతావరణ ఆధారిత బీమా పథకం కింద వేరుశనగకు ఎకరాకు రూ.640 ప్రీమియంతో రూ.32 వేల వరకు, పత్తికి రూ.1,140 ప్రీమియంతో రూ.38 వేల వరకు, టమోటాకు రూ.1,600 ప్రీమియంతో రూ.32 వేల వరకు, అరటికి రూ.3 వేల ప్రీమియంతో రూ.60 వేల వరకు బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. పంటలు సాగు చేసిన రైతులు ముందుగా తమ క్రాప్ బుకింగ్ను సమీప రైతు సేవా కేంద్రంలో నమోదు చేయించుకోవాలని, అనంతరం పంట బీమాకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బీమా నమోదుకు పట్టాదార్ పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, స్వీయ ధృవీకరణ పత్రం, ఓటీపీ కోసం మొబైల్ నంబర్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే నమోదు చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా బీమా సౌకర్యం పొందవచ్చని, ప్రకృతి విపత్తుల సమయంలో ఈ పథకం రైతులకు అండగా నిలుస్తుందని మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ పేర్కొన్నారు.