నరసాపురం, తాతకుంట్లలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం
రైతులకు శాస్త్రీయ సాగు విధానాలపై అవగాహన
విస్సన్నపేట, జూలై 15: ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలంలోని నరసాపురం, తాతకుంట్ల గ్రామాల్లో బుధవారం మండల వ్యవసాయాధికారి జి. రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులు నేరుగా పొలాల్లోనే శాస్త్రీయ సాగు పద్ధతులు అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని ఈ సందర్భంగా సూచించారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల యాజమాన్య పద్ధతులు, సమతుల్య ఎరువుల వినియోగం, చీడపీడల నివారణ చర్యలు, పంటలను తరచూ పరిశీలిస్తూ వ్యాధుల లక్షణాలు కనిపించిన వెంటనే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని రైతులకు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ సేవలు, రైతు సేవా కేంద్రాల ద్వారా లభించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో హెచ్ఓ బి. వాసవి సౌజన్య, ఏఈఓ ఉషారాణి, రైతు సేవా కేంద్రం సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొని రైతులకు పలు సూచనలు అందించారు. గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో హాజరై వ్యవసాయ నిపుణుల సలహాలు తెలుసుకుని సందేహాలను నివృత్తి చేసుకున్నారు.