రుణమేళా కోసం నరసరావుపేటలో విస్తృత ఏర్పాట్లు.. ఏఎస్ఎల్లో కలెక్టర్, ఇన్చార్జి ఎస్పీ పరిశీలన
పల్నాడు, జూలై 15: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 17న పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించనున్న రుణమేళా కార్యక్రమానికి హాజరుకానున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. కార్యక్రమానికి ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ఏఎస్ఎల్) నిర్వహించారు.
ఈ సందర్భంగా పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, జిల్లా ఇన్చార్జి ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఇస్సపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ను, సభ నిర్వహించనున్న కోడెల శివప్రసాదరావు స్టేడియాన్ని, వీఐపీ వాహనాలు, ప్రజల వాహనాల పార్కింగ్ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమం సజావుగా జరిగేలా చేపట్టాల్సిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఇన్చార్జి ఎస్పీ తెలిపారు. పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, ప్రతి అంశంలో సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు.
భద్రతా ఏర్పాట్లలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా కార్యక్రమ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ పూర్తి స్థాయి బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఏఎస్ఎల్ కార్యక్రమంలో పోలీసు సూపరింటెండెంట్ జె.వి. సంతోష్, అదనపు పోలీసు సూపరింటెండెంట్ (అడ్మిన్) రోహిత్ కుమార్ చౌదరి, నరసరావుపేట ఎస్డీపీఓ ఎం.ఎం. హనుమంతరావు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.