రూ.4 కోట్ల బంగారం చోరీ.. ట్రావెల్స్ బస్సులో వ్యాపారికి భారీ షాక్..!
అనంతపురం నుంచి హైదరాబాద్కు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న ఓ బంగారం వ్యాపారికి భారీ షాక్ తగిలింది. దాదాపు రూ.4 కోట్ల విలువైన 2.75 కిలోల బంగారం చోరీకి గురైన ఘటన నంద్యాల జిల్లా డోన్ సమీపంలో వెలుగుచూసింది.
హైదరాబాద్కు చెందిన బంగారం వ్యాపారి మోతీలాల్ అనంతపురం, ధర్మవరం ప్రాంతాల్లో వ్యాపార లావాదేవీలు ముగించుకుని తన సహాయకుడితో కలిసి మీనా ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్కు బయలుదేరాడు. అమ్ముడుపోకుండా మిగిలిన 2.75 కిలోల బంగారాన్ని వెంట తీసుకెళ్తున్నాడు.
శుక్రవారం రాత్రి అనంతపురం నుంచి బయలుదేరిన బస్సు, అర్ధరాత్రి సమయంలో డోన్ సమీపంలోని కొత్తపల్లి వద్ద ఉన్న భారత్ డాబా వద్ద ఆగింది. అనంతరం తెల్లవారుజామున జడ్చర్ల సమీపంలో ప్రయాణిస్తుండగా బంగారం ఉన్న బ్యాగ్ కనిపించకపోవడంతో మోతీలాల్ అప్రమత్తమయ్యాడు.
డ్రైవర్ను విచారించగా డోన్ సమీపంలోని డాబా వద్ద బస్సు ఆగిన సమయంలో ఇద్దరు వ్యక్తులు దిగిపోయినట్లు తెలిసింది. దీంతో బాధితుడు డోన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించిన పోలీసులు, బస్సును వెనుక నుంచి ఒక తెల్లటి స్కార్పియో వాహనం అనుసరిస్తున్నట్లు గుర్తించారు. డాబా వద్ద బస్సు ఆగిన సమయంలోనే చోరీ జరిగినట్లు అనుమానిస్తున్నారు.
స్కార్పియో వాహనం ఆచూకీ, టోల్గేట్ల సీసీ కెమెరా ఫుటేజీలు, బస్సులోని ప్రయాణికుల వివరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రూ.4 కోట్ల విలువైన బంగారం ఆచూకీ లభిస్తుందా లేదా అన్న ఆందోళన బాధితుల్లో నెలకొనగా, ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.