రూ.92 లక్షలతో సహకార పరపతి సంఘ భవన ప్రారంభం
రూ.92 లక్షలతో సహకార పరపతి సంఘ భవన ప్రారంభం
వెనుకబడిన తరగతుల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కొలుసు పార్థసారధి
ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి గ్రామంలో రూ.92 లక్షల వ్యయంతో నిర్మించిన సహకార పరపతి సంఘ భవనాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ వెనుకబడిన తరగతులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.
గత ప్రభుత్వం ప్రచారాలకే పరిమితమైందని విమర్శించిన మంత్రి, సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం ప్రజలకు మరింత మేలు చేస్తోందన్నారు. ఆగిరిపల్లి గ్రామంలో గత ప్రభుత్వం అమ్మఒడి పథకం కింద 980 మందికి రూ.1.27 కోట్లు అందించగా, కూటమి ప్రభుత్వం 1434 మందికి రూ.2.15 కోట్లు అందించిందన్నారు.
ఆగిరిపల్లి గ్రామ అభివృద్ధికి ఇప్పటికే రూ.8.38 కోట్లు ఖర్చు చేశామని, రాబోయే మూడు సంవత్సరాల్లో మరో రూ.10 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వమిదేనన్నారు.
రాష్ట్రంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు చదువులు పూర్తిచేసుకుని బయటకు వస్తున్నారని, వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం బహుళజాతి సంస్థలను రాష్ట్రానికి ఆహ్వానిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో అనేక కంపెనీలు రాష్ట్రానికి వస్తుండటంతో సుమారు ఆరు లక్షల ఉద్యోగాలు కల్పన అవుతాయని పేర్కొన్నారు.
రైతుల కోసం అన్నదాత సుఖీభవ, మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో రూ.20 వేల ఆర్థిక సాయం, నాయి బ్రాహ్మణులు మరియు రజకులకు విద్యుత్ సబ్సిడీలు, వికలాంగులు మరియు దీర్ఘకాలిక రోగులకు పెన్షన్ల పెంపు వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఒకేసారి రూ.4 వేల పెన్షన్ పెంపు దేశ చరిత్రలోనే ప్రత్యేకమని తెలిపారు.
మహిళలకు ఆస్తిలో హక్కులు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీనేనని, మహిళా సాధికారతకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బలమైన పునాది వేశారని కొనియాడారు. డ్వాక్రా మహిళల అభివృద్ధికి చంద్రబాబు చేసిన కృషి విశేషమన్నారు.
గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా రైతులను భయపెట్టారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రైతులకు రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తోందన్నారు. గత పాలన బెదిరింపులు, అరాచకాలతో నిండిపోయిందని, ఇప్పుడు అభివృద్ధి మరియు సంక్షేమాన్ని రెండు కళ్లలా భావిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
2029 ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఆశీర్వాదం అందించాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యేపై మంత్రి విమర్శలు
ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ, ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నిర్వహించిన ప్రెస్మీట్లో స్థానిక శాసనసభ్యుడు, మంత్రివర్గ సభ్యులు గ్రామాలకు వెళ్లిన ప్రతిసారి “కోట్లు తెచ్చేస్తామని చెబుతున్నారు” అంటూ ఎగతాళి చేయడం బాధాకరమన్నారు.
“మీరు ఏ గ్రామానికి వచ్చినా, ఏ శాఖలో ఎంత నిధులు తీసుకొచ్చామో ప్రజలే చెబుతారు. అవసరమైతే అధికారులను అడిగినా పూర్తి వివరాలు ఇస్తాం. నిజాలు తెలుసుకోకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు” అని మంత్రి పేర్కొన్నారు.
“15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన మీరు నియోజకవర్గ అభివృద్ధికి ఏమి చేశారో ప్రజలు ఆలోచిస్తున్నారు. ‘నాది నూజివీడు… నూజివీడు నాది…’ అని చెప్పుకుంటూ పేరుకే పరిమితమయ్యారు తప్ప అభివృద్ధిలో స్పష్టమైన ముద్ర వేయలేకపోయారు” అని మంత్రి విమర్శించారు.