రోడ్డును కమ్మేస్తున్న పిచ్చి చెట్లు.. చీకటి పడితే ప్రయాణికుల్లో భయం
రోడ్డును కమ్మేస్తున్న పిచ్చి చెట్లు.. చీకటి పడితే ప్రయాణికుల్లో భయం
లింగపాలెం/ములగలంపాడు, ఆగస్టు 21:
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ములగలంపాడు గ్రామం కాపుల బజారులో రహదారి పిచ్చి చెట్లతో నిండిపోయి అడవిని తలపిస్తోంది. రోడ్డుకు ఇరువైపులా పెరిగిన చెట్లు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చీకటి పడిన తర్వాత ఈ మార్గంలో ప్రయాణించాలంటే భయంతో వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.
ఈ రహదారిపై ప్రతిరోజూ సుమారు 200 మంది ప్రజలు రాకపోకలు సాగిస్తుండగా, 50 వరకు వాహనాలు ప్రయాణిస్తుంటాయి. అయితే రోడ్డును కమ్మేస్తున్న చెట్ల కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
అంతేకాకుండా సిమెంట్ రోడ్డులోని పగుళ్లలో పిచ్చి మొక్కలు పెరగడంతో రోడ్డు దెబ్బతింటోందని స్థానికులు తెలిపారు. మొక్కల వేర్లు విస్తరించి కాంక్రీటు పగుళ్లు పెరగడం, వర్షపు నీరు నిలిచిపోవడం వల్ల రహదారి త్వరగా పాడయ్యే ప్రమాదం ఉందన్నారు.
పిచ్చి చెట్ల పొదల్లో దోమలు, తేళ్లు, పాములు వంటి విషపూరిత జీవులు చేరే అవకాశం ఉందని, రాత్రి వేళల్లో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్డు పరిస్థితిని అధికారులు వెంటనే పరిశీలించి, పెరిగిపోయిన పిచ్చి మొక్కలు తొలగించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ములగలంపాడు గ్రామస్థులు కోరుతున్నారు.