రొయ్యల ఫీడ్ ధరల పెంపుపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం
రొయ్యల ఫీడ్ ధరల పెంపుపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం
అమరావతి, మే 12: రాష్ట్రంలోని ఆక్వా రైతులపై అదనపు భారం పడేలా రొయ్యల ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచడం సమంజసం కాదని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రొయ్యల ఫీడ్ తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలు పెరిగిన నేపథ్యంలో వనామీ ఫీడ్పై కిలోకు రూ.8, టైగర్ రొయ్యల ఫీడ్పై కిలోకు రూ.10 వరకు పెంచినట్లు సమాచారం అందిందన్నారు. ఇప్పటికే సాగు వ్యయాలు పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులపై ఈ నిర్ణయం మరింత భారంగా మారుతుందని తెలిపారు.
APSADA చట్టం ప్రకారం రైతు సంఘాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, ఫీడ్ కంపెనీలు నిబంధనలు పాటించకుండా వ్యవహరించడం ఆందోళనకరమన్నారు. ఈ విషయంపై ఫిషరీస్ కమిషనర్ ఇప్పటికే ఫీడ్ తయారీ సంస్థలకు రైతులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించినప్పటికీ, ధరల పెంపును అమలు చేయడం సరికాదని స్పష్టం చేశారు.
రైతుల సమస్యలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిగణిస్తోందని పేర్కొన్న మంత్రి, పెంచిన ధరలను వెంటనే నిలిపివేయాలని సంబంధిత ఫీడ్ తయారీ సంస్థలకు ఫిషరీస్ కమిషనర్ ద్వారా నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.
అలాగే ఈ అంశంపై రైతు సంఘాలు, ఫీడ్ తయారీ సంస్థల ప్రతినిధులతో బుధవారం ఉదయం సమావేశం నిర్వహించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
రాష్ట్రంలోని లక్షలాది ఆక్వా రైతుల ప్రయోజనాల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతు పక్షానే నిలుస్తుందని మంత్రి స్పష్టం చేశారు.