సామాజిక ఉద్యమకారుడు గజెల్లి వెంకటయ్యకు ఆత్మీయ సన్మానం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 51వ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీ నివాసి, ప్రముఖ సామాజిక తెలంగాణ ఉద్యమకారుడు గజెల్లి వెంకటయ్యను ఆయన ఆత్మీయ మిత్రులు మరియు సింగరేణి విశ్రాంత ఉద్యోగులు శాలువాతో ఘనంగా సత్కరించి, పూల బొకే అందజేసి ఆత్మీయ సన్మానం చేశారు. సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షునిగా, బీసీ సంఘాల నాయకుడిగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నిరుపేదలకు, వయోవృద్ధులకు, వికలాంగులకు, అంధులకు మరియు అనాథ ఆశ్రమాలలో అన్న, వస్త్ర వితరణ చేస్తూ అనాథలను ఆదుకుంటున్న వెంకటయ్య సేవా నిరతిని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా 2001 నుండి 2014 వరకు బెల్లంపల్లిలో తెలంగాణ పొలిటికల్ జేఏసీ (JAC) కన్వీనర్గా, 29 కుల సంఘాల అధ్యక్షుడిగా సీమాంధ్రుల వివక్షకు వ్యతిరేకంగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోలీసు కేసులకు, అరెస్టులకు అదరక బెదరక పోరాడిన నిఖార్సైన ఉద్యమ నాయకుడు వెంకన్న అని, ప్రస్తుతం సింగరేణి విశ్రాంత ఉద్యోగుల హక్కుల కొరకు, సహారా బాధితుల కొరకు ఆయన చేస్తున్న పోరాటాలు అభినందనీయమని మిత్రులు కొనియాడారు.
ఈ ఆత్మీయ సన్మానం పట్ల సన్మాన గ్రహీత గజెల్లి వెంకటయ్య స్పందిస్తూ.. తన సేవలను గుర్తించి ప్రేమాభిమానాలతో సత్కరించిన ఆత్మీయ మిత్రులకు, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులోనూ ఇదే రీతిలో సామాజిక సేవలను కొనసాగిస్తూ, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మరియు సామాజిక తెలంగాణ సాధన కోసం నిరంతరం పోరాడుతానని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నిచ్చకోళ్ల అంజయ్య, జిమ్ నిర్వాహకుడు జెట్టి మురహరి రావు, పులి కృష్ణ, పి. నారాయణ, ఎస్. రమేష్, రసకట్ల రాజయ్య, ఏ. కొమురయ్య, కస్తూరి సూర్యం, ఏ. గంగయ్య, రామ్ లాల్ తదితరులు పాల్గొనగా.. ముగింపులో "జై తెలంగాణ", "జోహార్ తెలంగాణ అమరవీరులకు", "సింగరేణి విశ్రాంత ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి", "పోరాడుదాం సామాజిక తెలంగాణ కోసం" అంటూ పెద్ద పెట్టున చేసిన నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది