సభల్లో కనిపించే జనసందోహం కాదు... పోలింగ్ బూత్లో కనిపించే మద్దతే అసలైన బలం: బుడ్డయ్య
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం, నరసాపురం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేట మండలం నరసాపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గొట్టేటి సుబ్రహ్మణ్యేశ్వరరావు (బుడ్డయ్య) యువత పాత్ర, ఎన్నికల రాజకీయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
గ్రామాల్లో 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువతను గమనిస్తే నాలుగు వర్గాలుగా కనిపిస్తారని ఆయన పేర్కొన్నారు. సుమారు 25 శాతం మంది గ్రామంలోనే ఉపాధి పొందుతూ జీవితంలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తారని, మరో 25 శాతం మంది ఉద్యోగాలు, వ్యాపారాల కోసం పట్టణాలకు వెళ్తారని తెలిపారు. ఇంకో 25 శాతం మంది పోటీ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం శ్రమిస్తూ చదువుకుంటారని చెప్పారు.
మిగిలిన 25 శాతం మందికి మాత్రం స్థిరమైన పని లేకుండా అడ్డాలు, గొడవలు, రాజకీయాల పేరుతో తిరుగుతూ తల్లిదండ్రులకు భారంగా, గ్రామానికి ఇబ్బందిగా మారుతున్నారని విమర్శించారు.
2019 నుంచి 2024 వరకు జరిగిన సభలు, రోడ్షోలు, "సిద్ధం" సభల్లో కనిపించిన జనసందోహాన్ని నిజమైన ప్రజా మద్దతుగా ప్రచారం చేశారని ఆయన అన్నారు. అయితే ఆ హడావుడిని మిగతా యువత నిశ్శబ్దంగా గమనించిందని పేర్కొన్నారు. చదువులు, ఉద్యోగాల కోసం బయట ఉన్న యువత ఎన్నికల సమయంలో గ్రామాలకు వచ్చి తమ కుటుంబ సభ్యులకు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఓటు వేయాలని అవగాహన కల్పించిందని తెలిపారు.
దీని ఫలితంగానే సభల్లో కనిపించిన భారీ జనసందోహం ఓట్లుగా మారలేదని, ఎంతో మాస్ ఫాలోయింగ్ ఉందని చెప్పుకున్న జగన్ మోహన్ రెడ్డికి 2024 ఎన్నికల్లో కేవలం 11 అసెంబ్లీ స్థానాలే దక్కాయని వ్యాఖ్యానించారు.
పనీపాట లేకుండా హడావుడి చేయడం, బైకులతో విన్యాసాలు చేయడం వల్ల మాస్గా కనిపించవచ్చేమో గానీ, వాటితో ఓట్లు రావని బుడ్డయ్య అన్నారు. ఇలాంటి ప్రవర్తనతో ఆలోచించి ఓటు వేసే వర్గాలు మరింత దూరమయ్యే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
చివరగా, "సభల్లో కనిపించే మాస్ కాదు... పోలింగ్ బూత్లో కనిపించే మద్దతే అసలైన బలం. ఈ తేడాను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది" అని వ్యాఖ్యానించారు.