సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: డిప్యూటీ సీఎంకు వినతి
ఈ నెల 13, 14 తేదీలలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో పర్యటించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేసినట్లు సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం తెలిపింది. మంచిర్యాలలో జరిగిన సంఘం సమావేశంలో అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన డిమాండ్లను వివరించారు. ముఖ్యంగా హెల్త్ కార్డు పరిమితిని రూ. 8 లక్షల నుంచి రూ. 25 లక్షలకు పెంచాలని, పెరిగిన గ్రాడ్యుటీ సీలింగ్ రూ. 20 లక్షలను 2017 సంవత్సరం నుండి వర్తించేలా చెల్లించాలని కోరారు. అలాగే, గత 25 ఏళ్లుగా పెంపునకు నోచుకోని కోల్ మైన్స్ పెన్షన్ను తక్షణమే పెంచాలని, అర్హులైన విశ్రాంత ఉద్యోగులకు వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వ ఆసరా పెన్షన్లతో పాటు తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
సొంత గృహాలు లేని విశ్రాంత కార్మికులకు ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు మంజూరు చేయాలని, సింగరేణి రికార్డుల్లో ఉన్న మారుపేర్ల సమస్యలను వెంటనే సరిచేయాలని డిప్యూటీ సీఎంకు సమర్పించిన వినతిపత్రంలో కోరినట్లు వారు తెలిపారు. ఏరియా ఆసుపత్రులలో గోల్డెన్ హ్యాండ్షేక్ తీసుకున్న విశ్రాంత ఉద్యోగులకు బీపీ, షుగర్ తదితర వ్యాధులకు సంబంధించిన మందులను ప్రతినెలా ఉచితంగా అందించాలని, సింగరేణిలో ఖాళీగా ఉన్న క్వార్టర్లను విశ్రాంత ఉద్యోగులకు కేటాయించేలా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం గౌరవాధ్యక్షులు రాళ్లబండి రాజన్న, ప్రధాన కార్యదర్శి పుదారి నర్సయ్య, ఉపాధ్యక్షులు ఏ. గంగయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి కాటం లక్ష్మణ్, నాయకులు జే. రాజన్న, జి. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు