సింగరేణిని అమ్మేయాలని చూస్తున్న కాంగ్రెస్: కల్వకుంట్ల కవిత ఫైర్
శ్రీరాంపూర్ ఆర్కే-7 మైన్ను సందర్శించిన తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కవిత
మహిళా ఉద్యోగుల సమస్యలపై ఆరా.. సరైన సౌకర్యాలు లేవని అసంతృప్తి
కార్మికుల హక్కుల కోసం హెచ్ఎంఎస్తో కలిసి టీఆర్ఎస్ పోరాటం
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఆర్కే-7 మైన్ను తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత మంగళవారం సందర్శించారు. మైన్ వద్ద కార్మికులు ఆమెకు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆమె కార్మిక మహిళా సూపర్ వైజర్లతో, అధికారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆనాడు సింగరేణిలో మహిళలు ఉండాలని పార్లమెంట్లో తాము పోరాటం చేశామని, కానీ చరిత్రలో ఎప్పుడెన్నడూ లేని విధంగా మహిళా ఉద్యోగులు వస్తున్నా వారికి కనీస సౌకర్యాలు లేకపోవడం బాధాకరమన్నారు. తల్లి కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఇస్తే.. ఇప్పుడు పిల్ల కాంగ్రెస్ సింగరేణిని అమ్మేయాలని చూస్తోందని ఆమె మండిపడ్డారు. తాము మైన్ దగ్గరకు వెళ్తే పోలీసులను మోహరించడం దారుణమని, "మీ రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ మీటింగ్ పెడితే ఏమీ కాలేదా?" అని ప్రభుత్వాన్ని నిలదీశారు. సింగరేణి రక్షణ సేన పార్టీ తరఫున కార్మికులకు అండగా నిలబడి ముందుకు నడిపిస్తామన్నారు.
సింగరేణిలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కనీసం అన్ ఫిట్ చేయడం లేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. 205 ఫైల్స్కు మెడికల్ బోర్డు అయ్యి నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో ఒక కార్మికుడు చనిపోవడం బాధాకరమన్నారు. గత రెండు రోజుల క్రితం డిప్యూటీ సీఎం 350 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారని, కానీ 200 మంది ఇంకా ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారని అన్నారు. మైన్ మీటింగులు పెట్టుకోవడం కార్మికుల హక్కు అని, దాన్ని అడ్డుకుంటామంటే ఊరుకునేది లేదన్నారు. సింగరేణిలో హెచ్ఎంఎస్ అధ్యక్షుడు రియాజ్ అవినీతి లేని, కార్మికుల కోసం పోరాటం చేసే నాయకుడు అని కొనియాడారు. సింగరేణిలో హెచ్ఎంఎస్ తో కలిసి తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పోరాటం చేస్తుందని, సింగరేణి మీ ఆడబిడ్డగా మీ ముందుకు వచ్చిన తనను మరియు ఈ రెండు సంఘాలను ఆశీర్వదించాలని కోరారు. కార్మికుల సంక్షేమం కోసం పోరాడాల్సింది పోయి, తమను అడుగడుగునా అడ్డుకోవడం ప్రభుత్వం మానుకోవాలని ఆమె హితవు పలికారు