స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా పారిశుధ్య కార్మికులకు అవగాహన కార్యక్రమం
చింతలపూడి మండలం రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు చింతలపూడి మండల కార్యాలయ సమావేశ మందిరంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పారిశుధ్య కార్మికుల సామర్థ్యాన్ని పెంపొందించడం, ఘన వ్యర్థాల నిర్వహణలో మెరుగైన పద్ధతులను అవలంబించడం, విధి నిర్వహణ సమయంలో తీసుకోవాల్సిన రక్షణ చర్యలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రథమ చికిత్స వంటి అంశాలపై సవివరంగా అవగాహన కల్పించారు.
అలాగే భారత ప్రభుత్వ నమస్తే పథకం, స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాలు, ఆరోగ్య మరియు ప్రమాద బీమా పథకాల గురించి వివరించారు. శానిటరీ వర్కర్లకు రూ.1 కోటి, ఔట్సోర్సింగ్ కార్మికులకు రూ.20 లక్షల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు తెలియజేస్తూ, వాటి ప్రయోజనాలు మరియు అర్హతలపై పూర్తి సమాచారం అందించారు.
ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ అంబటి రాంబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నకుమార్, ట్రైనింగ్ కన్సల్టెంట్ ఎం. నాగేశ్వరరావు (సాహా సంస్థ & వాష్ ఇన్స్టిట్యూట్), జిల్లా కోఆర్డినేటర్ జి.ఎస్.ఆర్. రాజు (వాష్ ఇన్స్టిట్యూట్) తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై పలు అంశాలపై సందేహాలను నివృత్తి చేసుకున్నారు.