షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో రూ. 54 లక్షల మోసం
గుంటూరులో షేర్ మార్కెట్లో భారీ లాభాలు వస్తాయని ఆశ చూపించి ఓ హాస్టల్ యజమాని నుంచి రూ.54 లక్షలు కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నగరంలో చర్చనీయాంశంగా మారింది.
పోలీసుల వివరాల ప్రకారం, గుంటూరు బ్రాడీపేటకు చెందిన కోటేశ్వరరావు హాస్టల్ నిర్వహిస్తున్నారు. ఆయన వద్ద సూపర్వైజర్గా పనిచేస్తున్న రామిరెడ్డి, తన స్నేహితుడు గోపీతో కలిసి తమకు షేర్ మార్కెట్పై మంచి అనుభవం, అవగాహన ఉందని నమ్మించారు.
షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని చెప్పి విడతల వారీగా కోటేశ్వరరావు నుంచి మొత్తం రూ.54 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. అయితే నెలలు గడిచినా లాభాలు ఇవ్వకపోవడంతో పాటు పెట్టిన అసలు పెట్టుబడిని కూడా తిరిగి చెల్లించలేదు.
దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు అరండల్పేట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల నుంచి డబ్బులు ఎలా సేకరించారు, ఎక్కడ పెట్టుబడి పెట్టారు అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.