శ్రీ రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత నరసింహస్వామికి శాకాంబరి అలంకరణ
శ్రీ రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత నరసింహస్వామికి శాకాంబరి అలంకరణ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని బోటిమీద వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా శుక్రవారం శాకాంబరి అలంకరణను వైభవంగా నిర్వహించారు.
ఆలయ అర్చకుడు వెంకటేశ్వరస్వామి ఆధ్వర్యంలో శ్రీ రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత నరసింహస్వామి ఉత్సవ విగ్రహాలతో పాటు గర్భాలయంలోని మూలవిరాట్ శ్రీ లక్ష్మీనరసింహస్వామిని వివిధ రకాల కూరగాయలతో తయారు చేసిన దండలు, అలంకరణ సామగ్రితో అత్యంత ఆకర్షణీయంగా అలంకరించారు. అనంతరం స్వామివారికి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.
శాకాంబరి అలంకరణ సందర్భంగా ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
పెనుగొలను గ్రామంలో చాలా కాలం క్రితమే తొలిసారిగా శాకాంబరి అలంకరణను ఈ ఆలయంలో ప్రారంభించినట్లు ఆలయ కమిటీ కోశాధికారి నాళ్ల రమేష్ తెలిపారు. అప్పటి నుంచి ఆషాఢ మాసంలో శాకాంబరి అలంకరణను ఆనవాయితీగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆలయంలోని గర్భాలయంలోకి కుల, మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవచ్చని ఆలయ నిర్వాహకులు వూటుకూరు నారాయణరావు తెలిపారు. భక్తులందరికీ స్వామివారి దర్శనం అందుబాటులో ఉండేలా ఆలయ నిర్వహణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.