శ్రీ విశ్వనాథ ఆలయ చైర్మన్ పదవిని బీసీలకే కేటాయించాలి
శ్రీ విశ్వనాథ ఆలయ చైర్మన్ పదవిని బీసీలకే కేటాయించాలి: జిల్లా కలెక్టర్కు ‘బీసీ సమాజ్’ వినతి
మంచిర్యాల పట్టణంలోని ప్రముఖ శ్రీ విశ్వనాథ ఆలయ పాలకమండలి చైర్మన్ పదవిని బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలని, అలాగే పాలకమండలిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సమాజ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయ చైర్మన్ పదవిని అనేక సంవత్సరాలుగా ఒకే సామాజిక వర్గానికి కేటాయించడం సామాజిక న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలతో పాటు ఇతర వెనుకబడిన వర్గాలకు నాయకత్వ అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 16, 38, 46 స్ఫూర్తికి అనుగుణంగా ఆలయ పాలకమండలి నియామకాల్లో సమాన అవకాశాలు, పారదర్శకత, సామాజిక న్యాయం పాటించాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు జరిగిన నియామకాలపై సమీక్ష నిర్వహించి, రాబోయే పాలకమండలిలో చైర్మన్ పదవిని బీసీలకే కేటాయించేలా దేవదాయ శాఖకు తగిన సూచనలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ జిల్లా ఉపాధ్యక్షులు బొలిశెట్టి లక్ష్మణ్, నాయకులు పెద్దపెల్లి సూరయ్య, చల్ల విజయ్ కుమార్, కొండ రాజు, కుడుక మోహన్ తదితరులు పాల్గొన్నారు