శ్రమజీవుల హక్కుల కోసం పోరాడిన ఆదర్శ కమ్యూనిస్టు ఆముదాల తిరుపతయ్య: వేముల ఒక్కయ్య
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు, జూన్ 3: శ్రమజీవుల హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేసిన ఆదర్శ కమ్యూనిస్టు నాయకుడు ఆముదాల తిరుపతయ్య అని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వేముల ఒక్కయ్య పేర్కొన్నారు. ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో ఆముదాల తిరుపతయ్య ఆరవ వర్ధంతి సందర్భంగా మాజీ సర్పంచ్ బోకినాల కాంతకుమారి అధ్యక్షతన నివాళి సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా వేముల ఒక్కయ్య మాట్లాడుతూ, “చదువు – చదివించు” అనే నినాదంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి తిరుపతయ్య విశేష కృషి చేశారని తెలిపారు. ఆయన స్థాపించిన ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులను నిరంతరం ప్రోత్సహిస్తూ, విద్యా వికాసానికి తోడ్పాటునందించారని అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం కృషి చేయడంతో పాటు యువత రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించారని గుర్తు చేశారు. వామపక్ష శక్తుల ఐక్యత కోసం కూడా తిరుపతయ్య విశేషంగా శ్రమించారని వక్తలు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ బూత్ కమిటీ సభ్యుడు ఆముదాల నోబుల్ రాజు, వైఎస్సార్సీపీ నాయకులు ఎ. కృష్ణ, బి. వెంకటరత్నం, మహిళా సంఘం నాయకురాలు పల్లిపాం భవాని, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొని ఆముదాల తిరుపతయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అభ్యున్నతి కోసం యువత రాజకీయాల్లోకి రావాలి అనే ఆశయంతో పనిచేసిన కామ్రేడ్ ఆముదాల తిరుపతయ్య సేవలను ఈ సందర్భంగా పలువురు స్మరించుకున్నారు.