టీటీడీ కళ్యాణ మండపం పేరుతో భూమి మ్యుటేషన్ చేయాలి
టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణం కోసం కొనుగోలు చేసిన భూమిని అదే పేరుపై మ్యుటేషన్ చేయాలని చిట్యాల బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. చిట్యాల పట్టణంలోని భువనగిరి రోడ్డులోని సర్వే నంబర్ 649లో టీటీడీ కళ్యాణ మండపం కోసం ఎకరం 12 గుంటల భూమిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. చిట్యాల పట్టణ ప్రజలు ఏ ఉద్దేశంతోనైతే డబ్బులు సమకూర్చి భూమిని కొనుగోలు చేశారో, అదే ఉద్దేశాన్ని నెరవేర్చేలా ఆ భూమిని టీటీడీ కళ్యాణ మండపం పేరుపై మ్యుటేషన్ చేయాలని అధికారులను కోరారు. టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణం కోసం ప్రజల సహకారంతో కొనుగోలు చేసిన భూమి విషయంలో ఎలాంటి ఇతర ప్రయోజనాలకు అవకాశం లేకుండా, కళ్యాణ మండపం పేరుతోనే రికార్డుల్లో నమోదు చేయాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సంత్ రవిదాస్ జయంతి ఉత్సవాల కన్వీనర్ మాస శ్రీనివాస్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గంజి గోవర్ధన్, జిల్లా కౌన్సిల్ మెంబర్ కూరెళ్ల శ్రీను, జిల్లా కార్యవర్గ సభ్యుడు జయారపు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.