గ్రామాల్లో రాత్రి బస.. ప్రజలకు పోలీసుల విస్తృత అవగాహన
ప్రజా భద్రతపై ప్రత్యేక చైతన్యం.. నేర రహిత సమాజమే లక్ష్యమని అన్నమయ్య జిల్లా పోలీసులు
మదనపల్లె | Ntoday News
ప్రజా భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు నేరాల నివారణకు ప్రజలను భాగస్వాములను చేసే లక్ష్యంతో అన్నమయ్య జిల్లా పోలీసులు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు పోలీసులు జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో రాత్రి బస చేస్తూ ప్రజలతో నేరుగా మమేకమై భద్రతా అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.
మహిళలు, చిన్నారుల రక్షణ, పోక్సో చట్టాలు, సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గంజాయి నిర్మూలనతో పాటు హెల్మెట్ వినియోగం, రోడ్డు భద్రత తదితర అంశాలపై గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్నారు.
రాబోయే వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ఉత్సవ కమిటీలకు పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు. మండపాల వద్ద భద్రతా ఏర్పాట్లు, నిబంధనల పాటింపు, నిమజ్జన కార్యక్రమాల నిర్వహణపై అవగాహన కల్పిస్తున్నారు.
అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచిస్తున్నారు.
నేర రహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి ప్రజా భద్రతను కాపాడేందుకు భాగస్వాములు కావాలని అన్నమయ్య జిల్లా పోలీసులు పిలుపునిచ్చారు.