టి.గుడిపాడు శివారులో కోడిపందాలపై పోలీసుల దాడి
చాట్రాయి, జూన్ 24: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం టి.గుడిపాడు గ్రామ శివారులో నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరంపై చాట్రాయి పోలీసులు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ ఆదేశాలు, నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ ఐ.వి. నాగేంద్ర కుమార్ పర్యవేక్షణలో చాట్రాయి ఎస్ఐ డి. రామకృష్ణకు అందిన సమాచారంతో ఈ దాడులు చేపట్టారు. దాడిలో ఒక కోడి పుంజు, రెండు కోడి కత్తులు, రూ.2,800 నగదు, నాలుగు సెల్ఫోన్లు, ఆరు మోటార్సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చాట్రాయి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్ఐ డి. రామకృష్ణ మాట్లాడుతూ ప్రజలను ఆర్థికంగా నష్టపరిచే జూద కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. జూదాన్ని నిర్వహించే వారిపైనా, పాల్గొనే వారిపైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోడిపందాలు, జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే డయల్-112కు లేదా స్థానిక పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.