ట్రాక్టర్ బోల్తా.. యువకుడు దుర్మరణం
ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండలంలోని మర్లపాడు గ్రామ శివారులో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
పోలీసుల వివరాల ప్రకారం.. రాయుడుపాలెం గ్రామానికి చెందిన విస్సంపల్లి మురళీకృష్ణ (30) తన తండ్రి రాములు, బాబాయి కుమారుడు నాగేంద్రబాబుతో కలిసి నారాయణపురంలోని తన అక్క ఇంటికి ట్రాక్టర్లో సామాగ్రి ఇచ్చి తిరిగి రాయుడుపాలెం వైపు బయలుదేరారు. భీమవరం–మర్లపాడు గ్రామాల మధ్య ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ఇంజన్ చెక్కపై కూర్చున్న మురళీకృష్ణ కిందపడగా, ట్రాక్టర్ ట్రక్కు ఆయనపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడగా, స్థానికులు వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు తెలిపారు.