ట్రాన్స్జెండర్లకు గుడ్న్యూస్.. కూటమి సర్కార్ కీలక నిర్ణయం..!
ట్రాన్స్జెండర్లకు గుడ్న్యూస్.. కూటమి సర్కార్ కీలక నిర్ణయం..!
సమాజంలో ఎన్నో ఏళ్లుగా వివక్ష, నిరాకరణ, ఉపాధి సమస్యలు, గుర్తింపు కోసం పోరాటం ఎదుర్కొంటున్న ట్రాన్స్జెండర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్జెండర్ హక్కుల పరిరక్షణతో పాటు వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేకంగా ‘రాష్ట్ర ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డు’ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం అధికారికంగా జీఓ ఎంఎస్ నంబర్-14 విడుదల చేసింది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ట్రాన్స్జెండర్ పర్సన్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) యాక్ట్-2019’, రూల్స్-2020 మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక అడుగు వేసింది. మహిళా, శిశు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ బోర్డు పనిచేయనుంది.
ఈ బోర్డులో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతినిధులను ప్రభుత్వం నామినేట్ చేసింది. ఆంధ్రా ప్రాంత ప్రతినిధిగా విశాఖపట్నం జిల్లా కలెక్టర్, రాయలసీమ ప్రతినిధిగా తిరుపతి జిల్లా కలెక్టర్ వ్యవహరించనున్నారు. ట్రాన్స్జెండర్ ప్రతినిధులుగా కోటా ప్రేమ్ సాగర్ రాయ్ (తూర్పుగోదావరి), నక్క జీవన్ కుమారి (గుంటూరు), బోను దుర్గ తదితరులను నియమించారు.
ఈ వెల్ఫేర్ బోర్డు ద్వారా ట్రాన్స్జెండర్లకు విద్య, వైద్యం, ఉపాధి, గృహ వసతి, న్యాయ పరిరక్షణ, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాల్లో ప్రత్యేక చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ట్రాన్స్జెండర్ వర్గాల సమస్యలను నేరుగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే వేదికగా ఈ బోర్డు పనిచేయనుండటంతో, ఈ నిర్ణయాన్ని పలువురు సామాజిక కార్యకర్తలు స్వాగతిస్తున్నారు.