పది కోట్ల ఓట్లకు ముప్పు
– యోగేంద్ర యాదవ్
అధ్యక్షుడు, స్వరాజ్ ఇండియా
(భారత్ జోడో అభియాన్ పరిశోధకుడు రాహుల్ శాస్త్రి సహకారంతో)
NTODAY NEWS: న్యూఢిల్లీ
దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలవుతున్న రెండో విడత ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–సర్ 2.0) భారత ప్రజాస్వామ్యానికి తీవ్ర సవాల్గా మారుతోంది. ఈ దశలో ఓట్ల తొలగింపులు మరింత విస్తృతంగా, మరింత నష్టదాయకంగా ఉంటాయని అందుబాటులో ఉన్న అధికారిక గణాంకాలు, మీడియా నివేదికలు సూచిస్తున్నాయి.
అందుబాటులో ఉన్న ఐదు రాష్ట్రాల అధికారిక డేటా, ఇతర రాష్ట్రాలు–కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వెలువడిన వార్తలను కలిపి పరిశీలిస్తే, ప్రస్తుత ఓటర్ జాబితాల నుంచి దాదాపు 11 కోట్ల పేర్లు సంభావ్య తొలగింపులకు గురయ్యే ప్రమాదం కనిపిస్తోంది. తుది తొలగింపుల సంఖ్య కొంత తక్కువగా ఉండవచ్చుగానీ, దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియ పూర్తయ్యే సరికి సుమారు పది కోట్ల ఓట్లు జాబితాల నుంచి తొలగిపోవచ్చనే అంచనా ఆందోళన కలిగిస్తోంది.
పతాకశీర్షికలకు అందని సంక్షోభం
ఇంత పెద్ద స్థాయి ఓటుహక్కు కోల్పోయే ప్రమాదం ఉన్నప్పటికీ, ఇది జాతీయ స్థాయి చర్చగా మారడం లేదు. బిహార్ ఎన్నికల అనంతరం జాతీయ పత్రికల్లో సర్పై కథనాలు తగ్గిపోయాయి. సమాచారం చెల్లాచెదురుగా ఉండటం, స్థానిక పేజీలకే పరిమితమవడం ఇందుకు కారణం. ఎన్నికల సంఘం (ఈసీఐ) ఓటర్ నమోదు గడువును పదే పదే పొడిగిస్తుండగా, తుది ఓటర్ జాబితాలు నాలుగు విడతలుగా వెలువడే అవకాశం కనిపిస్తోంది.
డిజిటలైజేషన్ శాతాలపై అర్థరహిత గణాంకాలను ముందుకు తెచ్చడం ద్వారా కీలకమైన రెండు అంశాలు మరుగున పడుతున్నాయి:
1. ఎన్యూమరేషన్ ఫామ్లు సమర్పించకపోవడంతో ముసాయిదా జాబితాల నుంచి తొలగింపునకు గురయ్యే వారు,
2. పాత జాబితాలతో తమ పేర్లను అనుసంధానం చేయలేక సంభావ్య తొలగింపును ఎదుర్కొనే వారు.
ముసాయిదా జాబితాలు ఏమి చెబుతున్నాయి?
రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, గోవా, లక్షద్వీప్, పాండిచ్చేరి వంటి ప్రాంతాల ముసాయిదా ఓటర్ జాబితాలు సర్ వాస్తవాలను బహిర్గతం చేశాయి. ఇతర రాష్ట్రాలకు సంబంధించి మీడియా నివేదికలే ఆధారం. అయితే రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ల అధికారిక గణాంకాలు ఈ నివేదికలను ధ్రువీకరించాయి. ఉత్తరప్రదేశ్కు సంబంధించిన అనధికారిక అంచనాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే బహిరంగంగా సమర్థించడం గమనార్హం.
ఎన్యూమరేషన్ ఫామ్లు సమర్పించని ఓటర్లు
గడువులోగా ఫామ్లు సమర్పించని ఓటర్ల సంఖ్య భారీగా ఉంది:
ఉత్తరప్రదేశ్: 2.93 కోట్లు
తమిళనాడు: 80 లక్షలు
గుజరాత్: 72 లక్షలు
పశ్చిమ బెంగాల్: 58 లక్షలు
రాజస్థాన్: 43 లక్షలు
మధ్యప్రదేశ్: 30 లక్షలు
ఛత్తీస్గఢ్: 28 లక్షలు
కేరళ: 21 లక్షలు
చిన్న రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో గోవా, పాండిచ్చేరి—లక్ష చొప్పున; అండమాన్–నికోబార్లో 0.6 లక్షలు. మొత్తంగా సర్కు ముందు ఉన్న జాబితాలతో పోలిస్తే 6.3 కోట్ల పేర్లు ముసాయిదా జాబితాల నుంచి తప్పిపోయే అవకాశం స్పష్టమవుతోంది—బిహార్ కంటే ఎక్కువ స్థాయిలో.
సహజమా? ఉద్దేశపూర్వకమా?
ఈ తొలగింపులు సహజమైనవిగా కనిపించడం లేదు. తమిళనాడు, కొంతవరకు కేరళ మినహా—ముందున్న ఓటర్ జాబితా అర్హుల సంఖ్యను మించిన రాష్ట్రం లేదు. ప్రతి రాష్ట్రంలో వయోజనులు–ఓటర్ల నిష్పత్తి తగ్గుతోంది; మొత్తం తగ్గుదల 12 శాతం పాయింట్ల వరకు ఉంది. బిహార్లో ఇది 8 శాతం పాయింట్లకు మించి ఉండగా, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్గఢ్లలో వ్యత్యాసం మరింత తీవ్రమైంది.
‘ఆబ్సెంట్, షిఫ్టెడ్’ పేరిట భారీ తొలగింపులు
ఈసీఐ ఓటర్లను ‘ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్’గా వర్గీకరిస్తోంది. ‘డెడ్’, ‘డూప్లికేట్’ కేటగిరీలు చాలా రాష్ట్రాల్లో సమానంగా ఉన్నప్పటికీ, ‘ఆబ్సెంట్’, ‘షిఫ్టెడ్’ కేటగిరీల్లో తొలగింపులు ఆందోళనకరంగా ఉన్నాయి—
ఛత్తీస్గఢ్: 9%
గుజరాత్: 10%
ఉత్తరప్రదేశ్: 13.7%
పశ్చిమ బెంగాల్: 1.6%
ఇది దేశంలో పుట్టి, దేశంలోనే నివసిస్తూ కూడా—స్వస్థలంలో గానీ, ఉపాధి ప్రాంతంలో గానీ ఓటర్లుగా లేని కొత్త వర్గాన్ని సృష్టించే ప్రమాదం కలిగిస్తోంది.
‘Unmapped’ ఓటర్లు: కొత్త ముప్పు
సర్ 2.0లో ‘unmapped’ ఓటర్ల తొలగింపుకు మరో మార్గం తెరచుకుంది. 2002/2003 ఓటర్ జాబితాల్లో తమ పేరు లేదా ‘బంధువు’ పేరు ఉందని రుజువు చేయలేని దరఖాస్తుదారులే వీరు. వీరి పేర్లు తాత్కాలికంగా ముసాయిదా జాబితాల్లో చేర్చి, పౌరసత్వ రుజువులు సమర్పించమని నోటీసులు ఇస్తారు. గడువులోగా పత్రాలు ఇవ్వకపోతే తుది జాబితాల నుంచి తొలగింపు తప్పదు.
ఈ ‘unmapped’ ఓటర్లపై అధికారిక డేటా లేదు. అందుబాటులో ఉన్న అంచనాల ప్రకారం—
ఉత్తరప్రదేశ్: 27.1%
గుజరాత్: 16%
తమిళనాడు: 10%
పశ్చిమ బెంగాల్: 4%
రాజస్థాన్: 3%
మధ్యప్రదేశ్: 2.4%
మొత్తంగా 5.25 కోట్ల మంది తుది జాబితాల నుంచి తొలగింపునకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇందులో 3.39 కోట్లు ఒక్క ఉత్తరప్రదేశ్కే చెందడం గమనార్హం.
ముగింపు:
ఎన్యూమరేషన్ ఫామ్లు సమర్పించని 6.3 కోట్లు, పౌరసత్వ రుజువులు లేని 5.3 కోట్లు—మొత్తం 11.6 కోట్ల మంది ఓటుహక్కు కోల్పోయే ప్రమాదం ఎదుర్కొంటున్నారు. తుది తొలగింపులు తాత్కాలిక జాబితాలో సగం మాత్రమే జరిగినా, ఇది ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనే అతిపెద్ద ఓట్ల తొలగింపుగా నిలిచే అవకాశముంది. భారత ప్రజాస్వామ్యం ముందు నిలిచిన ఈ మౌన సంక్షోభంపై తక్షణమే జాతీయ స్థాయి చర్చ అవసరం.
Follow us on
Website
Facebook
Instagram
YouTube