తెలంగాణ రవాణా శాఖలో కఠిన ఆదేశాలు: లంచాలకు సస్పెన్షన్ వేటు, ‘కోడ్’ వ్యవస్థపై నిషేధం
హైదరాబాద్: రవాణా శాఖలో అవినీతిని అరికట్టేందుకు ఉన్నతాధికారులు కఠిన చర్యలకు దిగారు. లంచాలు తీసుకుంటే తక్షణ సస్పెన్షన్ విధిస్తామని హెచ్చరించారు. ఏజెంట్లు, సిబ్బంది మధ్య ఉపయోగిస్తున్న ‘కోడ్’ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్యాలయాలకు ఆదేశాలు జారీ అయ్యాయి.
రవాణా శాఖ విజిలెన్స్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎం. చంద్రశేఖర్ గౌడ్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పలు కీలక మార్గదర్శకాలు పేర్కొన్నారు. డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాలు, ఆర్టీఏ కార్యాలయాల పనితీరులో పారదర్శకత పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
డ్రైవింగ్ పరీక్ష రోజున దరఖాస్తుదారుడు తప్పనిసరిగా ట్రాక్ వద్ద హాజరుకావాలని, ఎంవీఐ అధికారి ఆధార్ లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డు ద్వారా గుర్తింపును స్వయంగా నిర్ధారించాలని ఆదేశించారు. పరీక్షలో వాహనం స్టార్ట్ చేయడం నుంచి రివర్స్, లేన్ డ్రైవింగ్, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం వరకు అన్ని నైపుణ్యాలను పూర్తిగా పరీక్షించాలని స్పష్టం చేశారు.
ట్రాక్ ప్రవేశం వద్ద “ప్రైవేటు ఏజెంట్లకు ప్రవేశం నిషేధం” బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీసీ కెమెరాలు నిరంతరం పనిచేయాలని, అవి నిలిపివేయడం లేదా ట్యాంపరింగ్ చేయడం జరిగితే సంబంధిత అధికారులపై కఠిన శాఖాపర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
డ్రైవింగ్ ట్రాక్ పరిసరాలు, ఆర్టీఏ కార్యాలయాల్లో బ్రోకర్లు, ఏజెంట్లు, డ్రైవింగ్ స్కూల్ ప్రతినిధులకు పూర్తిగా నిషేధం విధించారు. ఏజెంట్లకు సహకరించినా లేదా లంచాలు తీసుకున్నా వెంటనే సస్పెన్షన్ చేసి విచారణ చేపడతామని స్పష్టం చేశారు.
అదే విధంగా ఏసీబీ బృందాల రాకను ముందుగానే తెలుసుకునేందుకు ఉపయోగించే ‘కోడ్లు’, సంకేతాలు, నంబర్ సీక్వెన్స్లను పూర్తిగా నిషేధించారు. ప్రతి నెలా 15వ తేదీకి కమిషనర్ కార్యాలయానికి కాంప్లయన్స్ నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.