తెలంగాణ సరిహద్దు లింగగూడెంలో అక్రమ ఇసుక నిల్వలు.. తెలంగాణకు తరలింపునకు సిద్ధమైన వాహనాలు..!
ఏలూరు జిల్లా సరిహద్దు ప్రాంతమైన లింగగూడెం గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను తెలంగాణకు తరలించేందుకు దళారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామ శివార్లలో ముందుగానే ఇసుకను డంపులుగా నిల్వ ఉంచి, రాత్రి వేళల్లో టిప్పర్ల ద్వారా సరిహద్దు దాటి తరలించేందుకు సిద్ధం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
సరిహద్దు ప్రాంతాల్లో గతంలోనూ ఇలాంటి అక్రమ ఇసుక రవాణా జరిగిన ఘటనలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, లింగగూడెంలో కూడా అదే తరహా కార్యకలాపాలు కొనసాగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఇసుక మాఫియా యథేచ్ఛగా వ్యవహరిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే అక్రమ ఇసుక వ్యాపారం పెరుగుతోందని ఆరోపిస్తున్న గ్రామస్తులు, రెవెన్యూ, మైనింగ్, పోలీసు శాఖలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులను స్వాధీనం చేసుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
లింగగూడెంలోని ఇసుక డంపులపై సంబంధిత శాఖలు వెంటనే దృష్టి సారించి వాస్తవాలను వెలికితీయడంతో పాటు, తెలంగాణకు అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.