తెలంగాణలో 93 వేల పెన్షన్లు రద్దు.. జూలై నుంచి కొత్త లబ్ధిదారుల ఎంపిక
తెలంగాణలో చేయూత పెన్షన్ల ప్రక్షాళన ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ పంపిణీలో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా సెర్ప్ నిర్వహించిన ప్రత్యేక సర్వేలో ఇప్పటివరకు 16 లక్షల మందికి పైగా లబ్ధిదారుల వివరాలను పరిశీలించగా, 93,624 మంది అనర్హులుగా గుర్తించబడ్డారు.
అనర్హుల జాబితాలో 40,751 మంది మరణించిన వ్యక్తులు ఉండగా, 41,689 మంది తమ చిరునామాల్లో నివసించడం లేదని అధికారులు గుర్తించారు. మరో 11,184 మందికి ఆధార్ వివరాల్లో లోపాలు ఉన్నట్లు, 3,475 మంది ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లినట్లు తేలింది. దీంతో ఈ నెలాఖరులోగా అనర్హుల పేర్లను జాబితా నుంచి తొలగించే ప్రక్రియ పూర్తి కానుంది.
అనర్హుల తొలగింపు అనంతరం కొత్త లబ్ధిదారుల ఎంపిక చేపట్టనున్నారు. ఇప్పటికే పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జూలై తొలి వారం నుంచి కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
అర్హులైన పేదలకు మాత్రమే సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ఈ సర్వే ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.