తెలంగాణలో కొత్తగా 121 మద్యం బ్రాండ్లు.. 18 కంపెనీలకు అనుమతుల ప్రక్రియ
తెలంగాణలో కొత్తగా 121 మద్యం బ్రాండ్లు.. 18 కంపెనీలకు అనుమతుల ప్రక్రియ
హైదరాబాద్ : తెలంగాణలో మద్యం వినియోగదారులకు కొత్త బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 121 మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టేందుకు ప్రక్రియ వేగవంతమైంది. ఈ మేరకు 18 మద్యం సరఫరా కంపెనీలు దరఖాస్తు చేసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.
కొత్తగా మార్కెట్లోకి రాబోతున్న బ్రాండ్లలో పలు రకాల బీర్లు, విస్కీ, వైన్, వోడ్కా, బ్రాందీ, జిన్, టకీలా వంటి మద్యం రకాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. చీతా, టైగర్, రెడ్ హార్స్, అబెస్ట్, ఫ్లెన్స్బర్గర్, భూటానిస్, కకావోస్ వంటి పేర్లతో బీర్లు కూడా జాబితాలో ఉన్నాయి.
కొత్త బ్రాండ్లకు సంబంధించి పారదర్శకత కోసం ఎక్సైజ్ శాఖ వివరాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఈ బ్రాండ్లు, సరఫరాదారులపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 1వ తేదీ లోపు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
అభ్యంతరాల పరిశీలన పూర్తయిన అనంతరం అర్హత సాధించిన బ్రాండ్లకు తుది అనుమతులు ఇచ్చి రాష్ట్రంలోని మద్యం దుకాణాల ద్వారా విక్రయాలు ప్రారంభించే అవకాశం ఉంది. కొత్త బ్రాండ్ల రాకతో మార్కెట్లో పోటీ పెరగడంతో పాటు వినియోగదారులకు మరిన్ని ఎంపికలు అందుబాటులోకి రానున్నాయి.