తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు మంచిది కాదు: పవన్ కల్యాణ్
అమరావతి: తెలుగు ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం దేశానికి, సమాజానికి మంచిది కాదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం. ఎవరైనా ఎక్కడికైనా వెళ్లవచ్చు. హద్దులకు కంచెలు వేయొచ్చు కానీ మనుషుల మనసులకు వేయలేరు అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించడం వేరని, కానీ తెలుగువారి కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు ఎప్పుడూ విభేదాలను ప్రోత్సహించలేదని గుర్తు చేశారు.
తెలంగాణలో ఆంధ్రా కాంట్రాక్టర్లు, ఏపీలో తెలంగాణ కాంట్రాక్టర్లు పనులు చేసుకుంటున్న సమయంలో ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. పుష్కర కాలం గడిచినా ఇంకా ద్వేష రాజకీయాలు కొనసాగడం బాధాకరమన్నారు.
"హైదరాబాద్ నా ఇల్లు. నా పార్టీ అక్కడే ఆవిర్భవించింది. అక్కడికి వెళ్లేందుకు ఎవరి అనుమతి అవసరం లేదు. తెలంగాణలో భూమిపుత్రులు సభలు నిర్వహించుకుంటే తప్పేంటి?" అని ప్రశ్నించారు.
ఈ వివాదం అనవసరంగా పెద్దదైందే తప్ప, దీని వెనుక ఎలాంటి కుట్ర లేదన్నారు. కేటీఆర్తో తనకు సోదర సమాన బంధం ఉందని, ఆయన ఉద్దేశపూర్వకంగా తప్పుగా మాట్లాడి ఉండరని అభిప్రాయపడ్డారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఇందులో లేదన్నారు.
కాంగ్రెస్లోని కొందరు నేతలు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించిన పవన్, ఇతర రాష్ట్రాల్లో రాజకీయాలు చేయడానికి కాంగ్రెస్ నాయకులకు స్వేచ్ఛ ఉంటే తమను మాత్రం ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ దేశమంతా పర్యటించినా ప్రాంతీయ విభేదాలను పెంచడం సరైంది కాదన్నారు.
బూర్గుల రామకృష్ణారావు, పీవీ నరసింహారావు వంటి మహనీయుల సేవలను గుర్తు చేసుకుంటూ, తెలుగు ప్రజల ఐక్యతే తన లక్ష్యమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రాంతీయ విద్వేషాలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.