తెనాలిలో దొంగల బీభత్సం: వరుస చోరీలతో ప్రజల్లో భయాందోళనలు
గుంటూరు జిల్లా తెనాలి పరిసర ప్రాంతాల్లో వరుస చోరీ ఘటనలు చోటుచేసుకుంటుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఒకదాని వెంట ఒకటి జరుగుతున్న దొంగతనాలు స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి.
ఇటీవల హాఫ్పేటలో పట్టపగలే ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు నగదును అపహరించారు. అలాగే కట్టేవరంలో ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన కుటుంబం తిరిగి వచ్చేసరికి ఇంట్లోని నగలు, నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. మరోవైపు రజకచెరువు ప్రాంతంలోని రాములవారి ఆలయంలో చోరీయత్నం జరగగా, ఎరుకలపూడిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో రాగి, ఇత్తడి సామగ్రిని దుండగులు అపహరించారు.
తాజాగా సుల్తానాబాద్లో ఓ మహిళ ఇంట్లో భారీ మొత్తంలో నగలు, నగదు మాయమైన ఘటన కలకలం రేపింది. వరుసగా జరుగుతున్న ఈ సంఘటనలు పోలీసుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ఈ చోరీల వెనుక ఒకే ముఠా ఉందా? లేక వేర్వేరు వ్యక్తుల ప్రమేయం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ప్రజలు రాత్రి వేళల్లో పోలీసు గస్తీని మరింత పెంచాలని, సీసీ కెమెరాల పర్యవేక్షణను బలోపేతం చేయాలని కోరుతున్నారు.