తిరుమలలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం.. తొలి రోజు పవిత్ర ప్రతిష్ట
తిరుమలలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం.. తొలి రోజు పవిత్ర ప్రతిష్ట
తిరుమల, ఆగస్టు 23: తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు కార్యక్రమాల్లో భాగంగా పవిత్ర ప్రతిష్టను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ వైదిక పండితుల ఆధ్వర్యంలో హోమాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సంపంగి ప్రాకారంలో స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది.
ఈ సందర్భంగా స్వామివారికి పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకం నిర్వహించారు. వేద పండితులు పంచసూక్తాలను పఠించారు. అనంతరం పవిత్ర ప్రతిష్ట కార్యక్రమం చేపట్టారు. మధ్యాహ్నం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక సమర్పణలు చేశారు.
సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు తిరుమల నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి యాగశాలలో వైదిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితర అధికారులు పాల్గొన్నారు.