తిరుపతిలో గంజాయి ముఠాపై పోలీసుల ఉక్కుపాదం.. 18 కేజీల గంజాయి స్వాధీనం, 6 మంది అరెస్ట్
తిరుపతి నగరంలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు భారీ చర్యలు చేపట్టారు. నగరంలోని కోటకొమ్మల వీధి, దొడ్డపురం వీధి, పెద్దకాపు లే అవుట్, కట్టమంచి ప్రాంతాలకు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 18 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
రెండు రోజుల క్రితం కోటకొమ్మల వీధిలో గంజాయి మత్తులో కొందరు యువకులు గొడవలకు దిగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో గంజాయి విక్రయాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
జీవకోన అరుణోదయ కాలనీకి చెందిన ఆదినారాయణ అనే వ్యక్తి రెండు కేజీల గంజాయితో అలిపిరి పోలీసులకు పట్టుబడి సోమవారం రిమాండ్కు వెళ్లాడు. అనంతరం దొడ్డపురంకు చెందిన హరికృష్ణ అలియాస్ హరికృష్ణ రెడ్డి, కోటకొమ్మల వీధికి చెందిన ఉదయ్ కుమార్, దొడ్డపురం వీధికి చెందిన జ్ఞానచరణ్, కట్టమంచికి చెందిన వెంకట సాయిని పోలీసులు అదుపులోకి తీసుకుని మంగళవారం కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు తరలించారు.
ఈ కేసులో ఉన్న ఇద్దరు మైనర్ బాలురను కోర్టు ఆదేశాల మేరకు బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు.
అయితే, అరెస్ట్ అయిన మైనర్ బాలురకు గంజాయి లావాదేవీలతో ఎలాంటి సంబంధం లేదని వారి తల్లిదండ్రులు ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ పిల్లలకు గంజాయి విక్రయించే అలవాటు లేదని, వారిని అన్యాయంగా ఇరికించారని ఆరోపించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు నిరసనకారులను అక్కడి నుంచి పంపించారు.