తిరువూరు రైతు బజార్లో ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రం ప్రారంభం
తిరువూరు రైతు బజార్లో ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రం ప్రారంభం
తిరువూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ప్రత్యేక బియ్యం విక్రయ కార్యక్రమంలో భాగంగా తిరువూరు రైతు బజార్లో ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాన్ని సోమవారం తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు అందించేందుకు ఈ ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆధార్ కార్డు నంబర్ ఆధారంగా మొబైల్ యాప్ ద్వారా బియ్యం విక్రయాలు నిర్వహిస్తామని, ప్రతి రేషన్ కార్డుదారునికి నెలకు గరిష్టంగా 10 కిలోల బియ్యం అందజేస్తామని వివరించారు.
ప్రభుత్వ నిర్ణయం మేరకు స్టీమ్ బియ్యాన్ని కిలో రూ.52, రా బియ్యాన్ని కిలో రూ.50 చొప్పున విక్రయిస్తున్నట్లు తెలిపారు. తిరువూరు రైతు బజార్తో పాటు తిరువూరు డివిజన్ పరిధిలోని 9 సీఎంఆర్ రైస్ మిల్లుల్లో కూడా ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.
ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు నాణ్యమైన బియ్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో తహసీల్దార్, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్, అధికారులు, రైస్ మిల్లర్లు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.