తిరువూరు: రంగస్థల కళాకారులకు త్వరలో బకాయీల చెల్లింపు
తిరువూరు: రంగస్థల కళాకారులకు త్వరలో బకాయీల చెల్లింపు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు మండలానికి చెందిన రంగస్థల కళాకారుల బకాయిలు త్వరలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుర్రకథ కళాకారుల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ డా. లక్ష్మీశా సంబంధిత అధికారులను ఆదేశించారు.
తిరువూరు రూరల్ ప్రాంతంలోని మల్లేల, సూరంపాలెం, టి.దేవరపల్లి తదితర గ్రామాలకు చెందిన బుర్రకథ దళాల కళాకారులకు ప్రభుత్వ ప్రదర్శనల పారితోషికాలు దాదాపు ఎనిమిదేళ్లుగా అందలేదు. దీంతో కళాకారులు పలుమార్లు అధికారులను కలిసి తమ సమస్యలను వివరించారు.
ఈ నేపథ్యంలో సోమవారం విజయవాడలో కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందించినట్లు ప్రజానాట్యమండలి మండల అధ్యక్ష, కార్యదర్శులు దార్ల ఏసుపాదం, సాంబార్ వెంకటేశ్వర్లు తెలిపారు. బుర్రకథ కళాకారుల్లో చాలామంది రోజువారీ కూలీలుగా జీవిస్తున్నారని, ఏళ్ల తరబడి పారితోషికాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.
ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు జి.వి.రంగారెడ్డి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, ప్రభుత్వ మంజూరు లేఖలను పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సూచించినట్లు తెలిపారు.
కలెక్టర్ను కలిసిన వారిలో బి.ఏసుదాసు, వై.సుజాత, ఎన్.సీతారత్నం, కె.వసంతరావు తదితరులు ఉన్నారు.