తిరువూరు తంగేళ్లబీడు కాలనీలో దోమల నివారణకు ఫాగింగ్
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, తిరువూరు:
వర్షాకాలంలో దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి అంటువ్యాధులను అరికట్టేందుకు తిరువూరు పట్టణంలోని 16వ వార్డు తంగేళ్లబీడు కాలనీలో బుధవారం ఫాగింగ్ కార్యక్రమం నిర్వహించారు. ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో కాలనీలోని వీధులన్నింటిలో ఫాగింగ్ నిర్వహించి దోమల నివారణకు చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఫాగింగ్ జరుగుతున్న సమయంలో చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఇంటి లోపలే ఉండాలని నిర్వాహకులు సూచించారు. అలాగే ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, పరిశుభ్రత పాటించడం ద్వారా దోమల వ్యాప్తిని నివారించవచ్చని అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సోమవరపు శ్రీనివాసరావు, ఉదారపు మార్కండేశ్వరావు, తొమ్మిదవ సచివాలయ శానిటేషన్ సెక్రటరీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.