తిరువూరులో డయేరియా నివారణకు అప్రమత్తంగా ఉండాలి ఆర్డీవో కుమార్
తిరువూరులో డయేరియా నివారణకు అప్రమత్తంగా ఉండాలి ఆర్డీవో కుమార్
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశా ఆదేశాల మేరకు తిరువూరు సబ్ డివిజన్ పరిధిలో డయేరియా వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ఆర్డీవో ఏ. కుమార్ అధికారులు, ప్రజలకు సూచనలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ వర్షాకాలంలో కలుషిత నీరు, కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల డయేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
తాగునీటి విషయంలో జాగ్రత్తలు పాటించాలి
నీటిని తప్పనిసరిగా మరిగించి చల్లార్చిన తర్వాతే తాగాలని సూచించారు. క్లోరినేషన్ చేయని నీటిని వినియోగించవద్దని, రోడ్ల పక్కన బహిరంగంగా విక్రయించే నీటిని తాగరాదని తెలిపారు. మంచినీటి పైపులైన్లలో లీకేజీలు గుర్తిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఆహార విషయంలో అప్రమత్తత అవసరం
బహిరంగంగా ఉంచిన, పాడైన ఆహార పదార్థాలను తీసుకోవద్దని సూచించారు. తాజా ఆహారాన్ని వండుకుని తినాలని, పండ్లు, కూరగాయలను శుభ్రమైన నీటితో కడిగిన తర్వాతే వినియోగించాలని తెలిపారు. వీధి వ్యాపారుల వద్ద అపరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం నివారించాలని సూచించారు.
ఆరోగ్య పరిరక్షణకు చర్యలు
వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని ఆర్డీవో సూచించారు. ప్రతి ఇంటిలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని, పిల్లలు, వృద్ధులు, గర్భిణీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గ్రామాల వారీగా పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించాలని, అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని ఆర్డీవో ఆదేశించారు.
తాగునీటి పథకాల నిర్వహణ అధికారులు నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించాలని, క్లోరినేషన్ ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని సూచించారు.
డయేరియా లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని, నిర్లక్ష్యం చేయవద్దని ఆర్డీవో ఏ. కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.