తిరువూరులో మూడు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల నిర్మాణానికి శ్రీకారం.. రూ.6 కోట్లతో పనులు
తిరువూరు, జూన్ 26: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణానికి స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు కీలక చర్యలు చేపడుతున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి తిరువూరుకు కృష్ణా జలాలను అందించే సుమారు రూ.240 కోట్ల తాగునీటి ప్రాజెక్టులో భాగంగా నడిం తిరువూరు, రాజుపేట, పి.టి. కొత్తూరు ప్రాంతాల్లో మూడు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను సుమారు రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్లు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు.
ఈ మేరకు సర్వే నంబర్ 205/1లో ప్రతిపాదిత స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. పట్టణ ప్రజల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ట్యాంకుల నిర్మాణానికి అనువైన ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో చర్చించారు.
పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తిరువూరు పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోజ్, టీపీవో నాగమల్లేశ్వరరావు, ఏఈ లోకేష్, ముత్యాల మధు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.