తిరువూరులో ప్రముఖ నాటక కళాకారుడు వాణి రంగారావు కన్నుమూత
తిరువూరులో ప్రముఖ నాటక కళాకారుడు వాణి రంగారావు కన్నుమూత
తిరువూరు, జూలై 20: ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన ప్రముఖ నాటక రంగ కళాకారుడు, గాయకుడు, ఫోటోగ్రాఫర్ వాణి రంగారావు (75) ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణవార్తతో తిరువూరు ప్రాంతంలో కళాకారులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
రంగారావు తిరువూరులో వాణి ఫోటో స్టూడియో నిర్వహిస్తూ ఫోటోగ్రఫీ రంగంలోనూ ప్రత్యేక గుర్తింపు పొందారు. మనిషిని చూసి అద్భుతంగా చిత్రాలు గీయడంలో ఆయనకు విశేష నైపుణ్యం ఉండేది. నాటక రంగంలో నటుడిగా, గాయకుడిగా తనదైన ముద్ర వేశారు.
ముఖ్యంగా ప్రముఖ గాయకుడు ఘంటసాల ఆలపించిన పాటలు, భగవద్గీతను ఆయన ఆలపించిన తీరు ఘంటసాల స్వరాన్నే తలపించేలా ఉండేదని అభిమానులు గుర్తు చేసుకున్నారు. ఆయన ప్రతిభను గుర్తించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అనేక సంస్థలు ఘనంగా సన్మానించాయి.
సుమారు ఏడాది క్రితం గంపలగూడెం మండలం పెనుగొలను శివాలయంలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో రంగారావును ఘనంగా సత్కరించినట్లు కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు తెలిపారు.
ఎవరు ఆహ్వానించినా సంతోషంగా కార్యక్రమాలకు హాజరై కళాభిమానులను అలరించే వ్యక్తిగా రంగారావు పేరు పొందారని, ఆయన మరణం నాటక కళారంగానికి తీరని లోటని పలువురు కళాకారులు, అభిమానులు పేర్కొన్నారు. పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.