తిరువూరులో విద్యుత్ అమరవీరుల దినోత్సవం.. అమరులకు ఘన నివాళులు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరులో
విద్యుత్ ఛార్జీల భారాలకు వ్యతిరేకంగా 2000 ఆగస్టు 28న వామపక్షాలు చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమంలో బషీరాబాగ్ వద్ద జరిగిన పోలీసు కాల్పుల్లో మృతి చెందిన విద్యుత్ అమరవీరుల దినోత్సవాన్ని శుక్రవారం తిరువూరు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అమరవీరుల చిత్రపటాలకు సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎన్సీహెచ్ శ్రీనివాస్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న విద్యుత్ విధానాలకు వ్యతిరేకంగా సాగిన విద్యుత్ ఉద్యమ ఫలితంగా చాలాకాలం పాటు విద్యుత్ ఛార్జీలు పెరగకుండా నిలిచాయని అన్నారు.
గత పదేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాలను మోపుతున్నాయని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విద్యుత్ విధానాలకు వ్యతిరేకంగా మరో ఉద్యమానికి ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.